ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జనవరి, 2007లోని పోస్ట్‌లను చూపుతోంది

ఎర్రికాలంలో పీర్లపండగ సంబరం

మొహర్రమ్ మొన్నటిది. కానీ పీర్లపండగ నా చిన్నప్పట్నుంచీ వుంది.ఏమన్నా మాట్లాడితే తాతల కాలంనుంచి, వాళ్ల తాతల కాలంనుంచీ కూడా వుంది. మా అవ్వ చెప్పేది - ఈ పండగ నిజానికి ఓ ఇద్దరు సమరవీరులగురించిన సంతాపం అని. వీరబల్లె చుట్టుపక్కల ఏ పల్లెలోజూసినా సంతాపం కాదుగదా దాని వాసనగూడా కనబడేదిగాదు. "ఉసేను అనే వీరుడు ఇంగా కొంతమందీ, జనంకోసం రాజుకు ఎదురునిలబడి తలలుపోగొట్టుకొన్నారు. వాళ్ల తెగువ, ధైర్యం ఏపొద్దూగూడా మనమెవురమూ మరిసిపోకండా వుండేదానికే ఈ పండగ జేసుకొనేది. వొగో పీరు వొగో వీరునికి గుర్తు" ఇట్లా ఏదో చెప్పేది మాయవ్వ. నాకు మాత్రం ఉసేను చావకండా వుంటే బాగుండుననిపించేది. సరే ఎదురుదిరిగినారు, దొరికిపోయి ప్రాణాలుపోగొట్టుకొనేలోగా ఎంతమందిని చంపినారు అని అడిగితే మాయవ్వగ్గూడా తెలీదు. "వొగోరూ వొగ యిద్దర్నన్నా సంపింటారుగదువ్వా?" అంటే కూడా నాక్కావాల్సిన జవాబురాదు. సచ్చేలోపల ఒక్కణ్ణైనా సంపింటే బాగుండునని నా ఆశ. "సంపింటార్లేవ్వా" అనేసి తృప్తిపడేవాణ్ణి. "ఒక్కొక్కడూ ఒక్కణ్ణైనా తెగనరికి సంపిటార్లే" అని మరోసారి మనసులోనే గట్టిగా అనుకొని, తృప్తిపడి, మన పార్టీమనుషులు సచ్చినందుకు బాధపడ